జగన్ చేయగలిగినవే చెప్తారు.. చేసి చూపిస్తారు- మంత్రి రోజా
టీడీపీ ఛార్జ్షీట్ విడుదల చేయటం పిచ్చికి పరాకాష్ట చర్య
మా పాలన చూసి చంద్రబాబుకు నరాలు చిట్లి పోయాయి
సీబీఐ చేసిన ఆరోపణలకు సాక్ష్యాలు లేవని జడ్జీ పేర్కొన్నారు
తిరుపతి మే 31,అనంత జనశక్తి న్యూస్
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పాలన చూసి చంద్రబాబుకు నరాలు చిట్లి పోయాయంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ ఛార్జ్షీట్ను ఆమె పిచ్చికి పరాకాష్టగా అభివర్ణించారు. 600 హామీలు ఇచ్చి, ఆరు హామీలు కూడా నెరవేర్చని వ్యక్తి చంద్రబాబుని, ముఖ్యమంత్రి సంతకాలకు విలువ లేకుండా చేశారంటూ దుమ్మెత్తి పోశారు. ఆస్తి కోసం కుటుంబీకులను వేధించిన వ్యక్తి బోండా ఉమా అని విమర్శించారు.
కాగా, మంత్రి రోజా తిరుపతిలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ తన పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని, చంద్రబాబు తాను సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశారు? అని ప్రశ్నించారు. చంద్రబాబు లాంటి మోసగాడు దేశంలోనే ఎక్కడా లేడని ఎద్దేవా చేసారు. వాలంటీర్ వ్యవస్థతో లబ్ధిదారుల ఇంటికే సంక్షేమ పథకాలు అందుతున్నాయని సీఎం జగన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 98.5శాతం నెరవేర్చారని ఉద్ఘాటించారు. జగనన్న ప్రభుత్వం తీసుకువచ్చిన అమ్మఒడి పై ఇష్టానుసారం మాట్లాడి.. ఇప్పుడు అమ్మకు వందనం అంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పథకాలు ఎందుకు అమలు చేయలేదు అని ప్రశ్నించారు.
*చంద్రబాబు చేసిన మోసాన్ని యువత మరిచిపోలేదు*
రాష్ట్రంలో యువతను చంద్రబాబు ఆదుకుంటాననడం పెద్ద జోక్ అని పేర్కొన్నారు. బాబు వస్తే జాబ్ అంటూ గతంలో మోసం చేశారని గతంలో చంద్రబాబు చేసిన మోసాన్ని యువత మరిచిపోలేదని అన్నారు. రైతు భరోసా కేంద్రాలతో అన్నదాతలకు సీఎం జగన్ అండగా నిలిచారని తెలిపారు. రైతులను చంద్రబాబు ఎలా మోసం చేశారో అందరికీ తెలుసని, 33000 చికిత్సలకు ఆరోగ్యశ్రీ అందిస్తున్నది సీఎం జగన్ మాత్రమేని ఉద్ఘాటించారు. మేనిఫెస్టో అంటే చంద్రబాబుకు చిత్తు కాగితంతో సమానమని దుయ్యబట్టారు. ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. సీఎం జగన్ చేయగలిగినవే చెప్పారని.. చెప్పినవి చేసి చూపించారని హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు అబద్దపు హామీలతో మోసం చేశారని మండిపడ్డారు.
*టీడీపీని నమ్మేవారు ఎవరూ లేరు*
నాలుగు తరాలు గుర్తు పెట్టుకునే విధంగా జగన్ నాలుగేళ్ల పాలన సాగిందని 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు, కొత్తగా ఇప్పుడు మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తాను అంటే నమ్మేవారు ఎవరూ లేరని పేర్కొన్నారు. 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. రైతులు కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగానే ఉన్నారు. ఆయనను నమ్మి ఓటేసే రైతులు ఎవ్వరూ లేరని తెలిపారు.
*సీబీఐ చేసిన ఆరోపణలకు సాక్ష్యాలు లేవని జడ్జీ పేర్కొన్నారు: మంత్రి రోజా*
ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారణ పేరుతో ఇబ్బంది పెట్టారు. వివేకా కేసులో సీబీఐ చేసిన ఆరోపణలకు సాక్ష్యాలు లేవని జడ్జీ చెప్పారు. ఎల్లో మీడియాలో ఇష్టానుసారం చర్చలు పెట్టి తప్పుడు ప్రచారం చేశారు. అందరూ గమనించాలి. తప్పుడు సమాచారంతో వ్యక్తిత్వ హననానికి పాల్పడటం పడిన వారిపై చర్యలు తీసుకోవాలి