జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైయస్ జగన్ సమీక్ష
ప్రజాసమస్యల పరిష్కారానికై జూన్ 23 నుంచి జగనన్న సురక్షా
రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాలు త్వరతిగతిన పూర్తి చేయాలి.
ఖరీఫ్ లో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొరత రాకూడదు
జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీపై కలెక్టర్లు సమీక్ష చేయాలి
అమరావతి జూన్ 15,అనంత జనశక్తి ప్రతినిధి
జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వచ్చే వినతుల పరిష్కారంలో క్వాలిటీ అన్నది చాలా ముఖ్యమని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు సేవలు అందించడంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పుతున్నామన్నారు. 26 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం వర్చువల్ గా సమీక్ష జరిపారు. జగనన్నకు చెబుదాంతో పాటు గడపగడపకూ మన ప్రభుత్వం, ఉపాధిహామీ పనులు, హౌసింగ్, వ్యవసాయం- సాగునీరు విడుల, జగనన్న భూ హక్కు & భూ రక్ష కార్యక్రమాలపైనా ఆయన సమీక్ష చేపట్టారు.
సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే..జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో భాగంగా ఒకవేళ గ్రీవెన్స్ ను రిజెక్ట్ చేస్తే… సంబంధిత ఫిర్యాదుదారు ఇంటికి వెళ్లి.. ఎందుకు రిజెక్షన్ కు గురైందో వారికి వివరించాలి. పరిశీలించని గ్రీవెన్సెస్ ఏమైనా ఉంటే.. 24 గంటల్లోగా వాటిని పరిష్కరించాలి అని సీఎం జగన్ అధికారులకు సూచించారు.
*ప్రజల సమస్యల పరిష్కారానికై నెలపాటు జరగనున్న జగనన్న సురక్షా*
జూన్ 23వ తేదీ నుంచి జులై 23వ తేదీ వరకూ జగనన్న సురక్షా కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనుబంధంగా ఈ కార్యక్రమం కొనసాగనుంది. ప్రజలకు అవసరమైన ఏదైనా డాక్యుమెంటేషన్, సర్టిఫికెట్లకు సంబంధించి, అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయా? లేవా? అన్నదానిపై అధికారులు వెరిఫై చేయనున్నారు. వీటిపై సంబంధిత మండలాధికారులు క్యాంపులు నిర్వహిస్తారు. సమస్యలు ఉన్నవారిని సచివాలయాల వద్దకు తీసుకువచ్చి.. వారి కావాల్సిన సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు అన్నీ అందిస్తారు. జగనన్న సురక్షలో వివిధ పథకాల కింద అర్హులుగా గుర్తించన వారికి ఆగస్టు 1న ఆయా పథకాలను మంజూరు చేస్తారు.
ఈ ఏడాదిలో 24 కోట్ల పనిదినాలు కల్పించాలి. ఇందులో 60శాతం పనిదినాలు.. ఈనెలాఖరులోగా పూర్తికావాలి. ప్రతిరోజూ ప్రతి జిల్లాలో కనీసం 75వేల పనిదినాలు కల్పించాలి. సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, డిజిటల్ గ్రంథాలయాలను వెంటనే పూర్తిచేయాలి అని సీఎం వైయస్ జగన్ అధికార యంత్రాగాన్ని ఆదేశించారు.
రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఇళ్లు కడుతున్నాం. ఇప్పటివరకూ సుమారు 3.9లక్షల వరకూ ఇళ్లు పూర్తయ్యాయి. రూఫ్ లెవల్, ఆపై ఉన్నవి సుమారు 5.27లక్షలు ఉన్నాయి. వీటిని త్వరతిగతిన పూర్తిచేసేలా చూడాలి. మిగతా ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి.. వాటి వేగాన్ని పెంచేలా చూడలని, ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయిన తర్వాత సుమారు రూ.147 కోట్లను ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించమన్నారు. అలాగే సీఆర్డీయే ప్రాంతంలో ఇళ్లనిర్మాణానికి అన్ని ఏర్పాట్లూ చేయాలి. జులై 8 నుంచి పనులు ప్రారంభించాలి. ఆప్షన్ -3 ఎంపిక చేసుకున్న వారికి వెంటనే ప్రభుత్వం నుంచి ఇళ్లు కట్టే నిర్మాణం మొదలుకావాలన్నారు.
ఖరీఫ్ పనులు ప్రారంభం అయ్యాయని విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొరత రాకుండా చూడాలని, ఎక్కడైనా కల్తీలు కనిపిస్తే.. కలెర్టర్లను, ఎస్పీలను బాధ్యుల్ని చేస్తానని, అక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. జులై 1 నుంచి ఇ-క్రాప్ బుకింగ్స్ ప్రారంభించి సెప్టెంబరు మొదటి వారానికి పూర్తిచేయాలి. సెప్టెంబరు నెలాఖరులోగా తుది జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలి. సీసీఆర్సీ కార్డులపై అవగాహన కల్పించి… కౌలు రైతులకు మేలు చేసేలా చర్యలు తీసుకోవలని అధికారులకు సూచించారు.
మొదటి ఫేజ్ లో 2వేల గ్రామాల్లో జగనన్న భూ హక్కు, భూ రక్ష కార్యక్రమం పూర్తయ్యింది. సచివాలయాల స్థాయిలోనే రిజిస్ట్రేషన్ సహా అన్నిరకాల సేవలు వీరికి అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. ఈ గ్రామాల నుంచి రైతులు ఎవ్వరూకూడా తహశీల్దార్, రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం రాకూడదు. ప్రతి పని కూడా గ్రామ సచివాలయాల స్థాయిలోనే జరగాలి. రెండో దశ కింద మరో 2వేల గ్రామాల్లో – సెప్టెంబర్ 30కల్లా భూపత్రాలు అందాలి. అక్టోబరు 15 నుంచి ఇక్కడ రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు ప్రారంభం కావాలన్నారు.
జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీపై కలెక్టర్లు సమీక్ష చేయాలి. ఎక్కడైనా సరిపడా కిట్లు లేకున్నా, ఇచ్చిన వస్తువుల బాగోలేకున్నా.. వెంటనే పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నుంచి ఈ సమాచారాన్ని సేకరించి వెంటనే తగిన చర్యలు తీసుకోవలన్నారు. నాడు – నేడు కింద పనులు పూర్తిచేసుకున్న పాఠశాలల తరగతి గదుల్లో 6వ క్లాసు, ఆపై క్లాసులకు సంబంధించి తరగతి గదుల్లో జులై 12 కల్లా… ఐఎఫ్పీ ప్యానెల్స్ ఏర్పాటు కావాలన్నారు. వాటిని చక్కగా వినియోగించుకోవడంపై ఉపాధ్యాయులకు మంచి శిక్షణ ఇవ్వాలని సీఎం జగన్ 26 జిల్లాల అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.