గోవిందరాజ స్వామి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభం
తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఆదివారం ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి.
మే 25వ తేదీన మహాసంప్రోక్షణతో ముగియనున్నాయి. ఆలయంలో ఏర్పాటు చేసిన యాగశాలలో 37 మంది రుత్వికులు 19 హోమగుండాలలో హోమాలు నిర్వహించారు. ఆదివారం ఉదయం 8.30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు యాగశాలలో హోమగుండాన్ని వెలిగించి పుణ్యాహవచనం, విష్వక్సేనారాధన, పంచగవ్యారాధన, వాస్తుహోమం, రక్షాబంధనం, కలశస్థాపన, వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.
కళాకర్షణ :రాత్రి 8 నుండి 10 గంటల వరకు కళాకర్షణలో భాగంగా గర్భాలయంలోని దేవతామూర్తుల శక్తిని కుంభం(కలశం)లోకి ఆవాహన చేస్తారు. ఈ కుంభాలతో పాటు ఉత్సవమూర్తులను యాగశాలలోకి వేంచేపు చేస్తారు.ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ప్రధాన అర్చకులు శ్రీనివాస దీక్షితులు, డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో రవి కుమార్, సూపరింటెండెంట్లు
నారాయణ, మోహన్ రావు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు ధనంజయులు, శ్రీ రాధా కృష్ణ, అర్చక బృందం పాల్గొన్నారు.